Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేదని సీడబ్ల్యూసీ ఎప్పుడూ చెప్పలేదు
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:46 AM
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు బేరేజ్ల వైఫల్యానికి ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మరియు మాజీ మంత్రి హరీష్ రావులు కారణమని ఆరోపించారు.
కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్, హరీశే కారకులు
బీఆర్ఎస్ కక్కుర్తితో రాష్ట్రంపై శాశ్వత ఆర్థిక భారం
ప్రజలు రూ.16 వేల కోట్ల వడ్డీలు కడుతున్నారు: ఉత్తమ్
దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరు: ఆది శ్రీనివాస్
ఈటల.. మళ్లీ బీఆర్ఎ్సలోకి పోవాలని చూస్తున్నారు: మేడిపల్లి సత్యం
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులే ప్రధాన కారకులని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ ఏ రోజూ చెప్పలేదని, పైసల కక్కుర్తి కోసం ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చి కాళేశ్వరం చేపట్టారని పేర్కొన్నారు. కాంగ్రె్సకు పేరు రాకూడదనే కారణంతోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని తెలిపారు. బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు శనివారం ఇచ్చిన ప్రజంటేషన్పై ఉత్తమ్ మండిపడ్డారు. నాసిరకం పనులు చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఎదురుదాడికి దిగుతావా? అంటూ మాజీ మంత్రి హరీశ్రావుపై ధ్వజమెత్తారు.
99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా ఇచ్చావ్ ?
కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఆ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీటినేకాళేశ్వరం నీటిగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 2019లో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే.. 2019-24 వరకు ఐదేళ్ల కాలంలో 162 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారని, వరదలు రాగానే అందులోని 63 టీఎంసీలను సముద్రంలోకి వదిలిపెట్టారని ఉత్తమ్ వివరించారు. మిగిలిన 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందించారో? నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం(అన్నారం) పంప్హౌస్ నీట మునిగిందని, అదే ఏడాది కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్హౌస్ బ్రెస్ట్ వాల్ కూలి మోటార్లన్నీ దెబ్బతిన్నాయని ఉత్తమ్ గుర్తు చేశారు. 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందన్నారు. బ్యారేజీలను నీటి మళ్లింపు కోసమే కడతారని, బెంగాల్లోని ఫరక్కా బ్యారేజీ కట్టింది కూడా అందుకేనని చెప్పారు. రాతి పునాదిపై నిర్మాణం చేపట్టడం వల్లే.. ఫరక్కా బ్యారేజీ ఇన్నేళ్లుగా చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రతిపాదన, నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనేనని ఎద్దేవా చేశారు. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం నిర్మిస్తే కాళేశ్వరం బ్యారేజీలను నిధుల మళ్లింపు కోసం కట్టారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..