Tummala: మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:13 AM
మూసీ ప్రక్షాళన పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అప్పులు, ఆర్థిక భారం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.
గోదావరి జలాలు అందిస్తాం: మంత్రి తుమ్మల
2026 జనగణన అనంతరం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం: మంత్రి ఉత్తమ్
మోత్కూరు/తుంగతుర్తి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళన పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అప్పులు, ఆర్థిక భారం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. సభలో తుమ్మల మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 2026లో జనాభా గణన అనంతరం పెరిగిన ఎస్సీ జనాభాను అనుసరించి రిజర్వేషన్లను 17.5 లేదా 18 శాతానికి పెంచుతామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ ఫేజ్-2లో కాల్వల పొడిగింపు, మరమ్మతులు పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తామని ఆయన తెలిపారు.