TTD: రేపు సెప్టెంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:47 AM
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబరు నెల లక్కీడిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, జూన్16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబరు నెల లక్కీడిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటి కోసం భక్తులు 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిప్లో సేవలు పొందిన భక్తులు 20 నుంచి 22 మధ్యాహ్నంలోపు టికెట్ సొమ్ము చెల్లిం చి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక, 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ టికెట్లను విడుదల చేస్తారు.
అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఉంచనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి టోకెన్లు జారీ చేస్తారు. 24 ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేస్తారు. 25న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారిసేవ, పరకామణిసేవ, నవనీతసేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెలా కోటాను విడుదల చేయనున్నారు.