Share News

‘పేలుడు పదార్థాల’ కేసులో టీపీసీసీ నేత చంద్రశేఖర్‌రెడ్డికి రిమాండ్‌

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:29 AM

పేలుడు పదార్థాలైన జిలెటిన్‌ స్టిక్స్‌ను అక్రమంగా నిల్వ ఉంచారంటూ కామారెడ్డికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

‘పేలుడు పదార్థాల’ కేసులో టీపీసీసీ నేత చంద్రశేఖర్‌రెడ్డికి రిమాండ్‌

  • జిలెటిన్‌ స్టిక్స్‌ నిల్వ ఉంచడంపై కేసు నమోదు

  • పరారీలో ఉన్న అతని సోదరుడి కోసం గాలింపు

  • నా భర్త చంద్రశేఖర్‌ అరెస్టు అక్రమం: ఇందుప్రియ

కామారెడ్డి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పేలుడు పదార్థాలైన జిలెటిన్‌ స్టిక్స్‌ను అక్రమంగా నిల్వ ఉంచారంటూ కామారెడ్డికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే విషయమై ఆయన సోదరుడు సురేందర్‌రెడ్డిపై సైతం కేసు నమోదవ్వగా.. పరారీలో ఉన్న ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. స్థానిక కేపీఆర్‌ కాలనీలో ఓ ఖాళీ స్థలంలో బండరాళ్లను పగలగొట్టేందుకు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలైన జిలెటిన్‌ స్టిక్స్‌ను నిల్వ ఉంచారని పోలీసులకు సమాచారమందడంతో రెండ్రోజుల క్రితం విచారణ చేపట్టి నలుగురిని అరెస్టు చేశారు.


విచారణలో వారిచ్చిన సమాచారంతో చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఓ వెంచర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ చేసిన జిలెటిన్‌ స్టిక్స్‌, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శనివారం చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే భర్త చంద్రశేఖర్‌ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన భార్య, మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ ఆదివారం తీవ్రంగా ఖండించారు. తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌ చేశారంటూ మండిపడ్డారు.

Updated Date - Jul 07 , 2025 | 01:29 AM