Share News

Mahesh Kumar Goud: మీ పాలన.. మా పాలనపై చర్చకు సిద్ధమా?

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:35 AM

కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనపైన కరీంనగర్‌ నడిబొడ్డున చర్చకు సిద్ధమా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు.

Mahesh Kumar Goud: మీ పాలన.. మా పాలనపై చర్చకు సిద్ధమా?

  • బండి సంజయ్‌కు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్‌

  • కేటీఆర్‌, హరీశ్‌ ఏనాడైనా ఓయూకి వచ్చారా?: పీసీసీ

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనపైన కరీంనగర్‌ నడిబొడ్డున చర్చకు సిద్ధమా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా బండి సంజయ్‌ ఎన్నిసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారో ఆయనకు గుర్తు లేదా? అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని, రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే బీజేపీ ప్రభుత్వం.. కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న దేవాలయాల అభివృద్ధికి ఒక్క పైసా అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు.. ప్రాజెక్టుల కేటాయింపుల్లో అన్యాయంపై ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పుకోలేక దాట వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు, కరీంనగర్‌కు బండి సంజయ్‌ ఏమి చేశారో లెక్కలు చెప్పగలడా అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లులను కేంద్రం అడ్డుకుంటున్నా.. ఒక బీసీ బిడ్డగా బండి సంజయ్‌ ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు.


ఓట్‌ చోరీని రాహుల్‌గాంధీ ఆధారాలతో సహా నిరూపించడంతో బీజేపీ నేతలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారన్నారు. బండి సంజయ్‌కు రాజకీయ సన్యాయం, మఠంలో స్థిరనివాసం ఖాయమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో కేటీఆర్‌, హరీశ్‌ రావులు ఒక్కనాడైనా ఉస్మానియా వర్శిటీ(ఓయూ)కి వచ్చారా అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్కనాడూ ఓయూకి రాని బాల్క సుమన్‌.. ఓయూకి సీఎం రేవంత్‌ రాకపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి ఆమె వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. కాగా, ఉప రాష్ట్రపతి పదవికి తాజా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించడంలో రేవంత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించి జాతీయ రాజకీయాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారని రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌ అన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 05:35 AM