Adilabad: ప్రత్యేక జాకెట్తో దేశీదారు మద్యం రవాణా
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:53 AM
ప్రత్యేకంగా తయారు చేసుకున్న జాకెట్లను ధరించి మహారాష్ట్ర నుంచి నిషేధిత దేశీదారు మద్యాన్ని గుట్టుగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్న ముగ్గురిని ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురి అరెస్టు
ఆదిలాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేకంగా తయారు చేసుకున్న జాకెట్లను ధరించి మహారాష్ట్ర నుంచి నిషేధిత దేశీదారు మద్యాన్ని గుట్టుగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్న ముగ్గురిని ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఒక్కో జాకెట్లో 25 వరకు మద్యం సీసాలు పట్టేలా జేబు లు ఏర్పాటు చేసుకున్న అక్రమార్కులు.. వాటిని లోపల ధరించి పైన వేరే వస్త్రాలు వేసుకుంటున్నారు.
రోజూ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి నిషేధిత మద్యాన్ని గుట్టుగా తెచ్చి విక్రయిస్తున్నారు. ఇలా మద్యం తరలిస్తున్న ముగ్గురిని శనివారం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.5వేల విలువైన 140 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పెండల్వాడకు చెందిన కట్టె అశోక్, భీంపూర్ మండలం లింగూడకుచెందిన రజిత, ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసారికి చెందిన అరుణ్ను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ సీఐ రేండ్ల విజయేందర్ తెలిపారు.