Model Schools: ఏడేళ్ల తర్వాత మోడల్ స్కూళ్ల క్యాడర్ మార్పు
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:19 AM
ఏడేళ్ల తర్వాత మోడల్ స్కూళ్ల క్యాడర్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది.
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల తర్వాత మోడల్ స్కూళ్ల క్యాడర్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది. కొత్త జిల్లాల విభజన, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత చేయాల్సిన మార్పు ఇప్పటి వరకు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలోని బోధనా సిబ్బంది పదోన్నతులకు అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాడర్ మార్పునకు నిర్ణయం తీసుకోవడంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా 66 మంది ప్రిన్సిపాళ్లు, దాదాపు 300 మంది టీజీటీలు.. పీజీటీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఇప్పటివరకు మొత్తం మోడల్ స్కూళ్లను రెండు జోన్లుగా కేటాయించగా.. తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు జోన్లు, మల్టీ జోన్లుగా విభజించారు. ఇంతకాలం రాష్ట్ర క్యాడర్గా ఉన్న ప్రిన్సిపాళ్లు మల్టీ జోనల్ క్యాడర్గా, జోనల్ క్యాడర్గా ఉన్న పీజీటీలు మల్టీ జోనల్ క్యాడర్గా, జోనల్ క్యాడర్ కింద ఉన్న టీజీటీలను నూతన 7 జోన్లకు కేటాయిస్తారు.