Government Schools: 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట బడి!
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:23 AM
రాష్ట్రంలో 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలుండే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడులు తెరవాలని సర్కారు నిర్ణయించింది.
రాష్ట్రంలో 212 గ్రామాలు, 359 పట్టణ
కాలనీల్లో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
డీఈవోలకు ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలుండే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడులు తెరవాలని సర్కారు నిర్ణయించింది. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే స్కూళ్లు మూతపడి ఉంటే వాటినీ తెరవనుంది. ఈ నేపథ్యంలోనే 212 గ్రామాలు, 359 పట్టణ కాలనీలు/వార్డుల్లో ప్రాథమిక స్కూళ్ల అవసరముందని సర్కారు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో డీఈవోలు, ఎంఈవోల వర్క్షాపు జరిగింది. ‘20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల జాబితాను రూపొందించాం.
సంబంధిత డీఈవోలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు లేదా అద్దె వసతి గృహాల్లో పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు భవనాలకు అద్దెలను నిర్ణయించే విధానాలను త్వరలో తెలియజేస్తాం. ఫర్నిచర్, స్టేషనరీ, ఇతర విద్యా సామగ్రికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తాం’ అని పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ పేర్కొన్నారు.