Congress: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు సమాధి
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:44 AM
బనకచర్ల పేరుతో, తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్తో పబ్బం గదుపుకోవాలని కేటీఆర్, హరీశ్రావు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు.
తెలంగాణ సెంటిమెంట్తో పబ్బం గడుపుకుంటున్న కేటీఆర్, హరీశ్: కాంగ్రెస్ ఎంపీల ఫైర్
న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల పేరుతో, తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్తో పబ్బం గదుపుకోవాలని కేటీఆర్, హరీశ్రావు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సమాధి కడతారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కడియం కావ్య, సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, పోరిక బలరాం నాయక్ న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్, రాజ్యాంగం కోసం కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
దళిత ముఖ్యమంత్రితోపాటు అనేక హామీలు నెరవేర్చని వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్షనేత కేసీఆర్ ఫాం హౌస్లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల జల వివాదాల విషయంలో బుధవారం కీలక చర్చ జరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులపై మాట్లాడానికి కేటీఆర్కు అర్హత లేదని, ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వస్తే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. కేటీఆర్ ఇలాగే మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.