Government Hospitals: ప్రాంతీయ ఆస్పత్రులకు బ్రాండింగ్
ABN , Publish Date - May 20 , 2025 | 04:43 AM
రాష్ట్రవ్యాప్తంగా 202 ప్రభుత్వ ఆస్పత్రులకు దశలవారీగా బ్రాండింగ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలిదశలో 84 ఆస్పత్రులను ఎంపిక చేశారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తొలిదశలో 84 ఆస్పత్రుల ఎంపిక
దశలవారీగా 202 ఆస్పత్రులకు బ్రాండింగ్
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 202 ప్రభుత్వ ఆస్పత్రులకు దశలవారీగా బ్రాండింగ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలిదశలో 84 ఆస్పత్రులను ఎంపిక చేశారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 84 ఆస్పత్రులలో వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలో 44 ఉండగా, మరో 40 ఆస్పత్రులు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)పరిధిలో ఉన్నాయి. టీవీవీపీ పరిధిలోని 40ఆస్పత్రుల్లో మూడు జిల్లా ఆస్పతులు (కింగ్కోఠీ, భువనగిరి, తాండూరు) ఉండగా, మిగిలిన 37 ప్రాంతీయ ఆస్పత్రులున్నాయి. అలాగే డీఎంఈ పరిధిలో ఒక్క హైదరాబాద్లోనే 10 ఆస్పత్రులున్నాయి.
ఉస్మానియాకు కొత్త ఆస్పత్రిని నిర్మించనున్న నేపథ్యంలో దాన్ని బ్రాండింగ్ నుంచి మినహాయించారు. నిపుణులైన వైద్యులున్నా, ఉచితంగా శస్త్రచికిత్సలు, వ్యాధినిర్ధారణ పరీక్షలు చేస్తున్నా, ఉచితంగా మందులందిస్తున్నా సర్కారీ ఆస్పత్రులంటే ప్రజల కోణంలో చిన్నచూపు ఉంది. రోగులకు అరకొర సౌకర్యాలు, పరిశుభ్రత లేకపోవడం, వైద్యసిబ్బంది ప్రవర్తన సరిగా లేకపోవడం వంటివి సర్కారు ఆస్పత్రుల ప్రతిష్ఠ మసకబారడానికి ప్రధాన కారణాలని గుర్తించారు. బ్రాండింగ్లో భాగంగా ఇటువంటి అంశాలన్నింటిపైనా దృష్టి సారించనున్నారు. బ్రాండింగ్లో భాగంగా ఎన్ఎంసీ నిబంధనలు, చట్టబద్దమైన నిబంధనలు, రోగులకు కల్పించే సౌకర్యాలు, పాలనపరమైన విషయాలపై సర్కారు దృష్టిసారించింది.