స్టార్ హోటల్లా స్టేట్ గెస్ట్ హౌస్!
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:49 AM
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే అతిథులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ ప్రాంగణంలో స్టేట్ గెస్ట్ హౌస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్, మార్చి6 (ఆంధ్రజ్యోతి): విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే అతిథులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ ప్రాంగణంలో స్టేట్ గెస్ట్ హౌస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీసుగా వినియోగించిన భవన సముదాయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చింది. ఈ స్టేట్ గెస్ట్ హౌస్ను రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ స్టేట్ గెస్ట్ హౌస్ను ఫైవ్ స్టార్ హోటల్ను మరిపించేలా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన అతిథులకు ఫైవ్స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసి రూ.కోట్లలో ప్రజాధనాన్ని వృథా చేసిందని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్ను వినియోగిస్తుందని వివరించారు.