Excise Department: బీరు సీసాలపైనా లేబుల్స్
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:56 AM
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బీరు సీసాలపై కూడా లేబుల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇవి కల్తీ మద్యం నియంత్రణ కోసం, ట్రాక్ అండ్ ట్రేస్ సాఫ్ట్వేర్తో పాటు ప్రత్యేక బార్ కోడ్ను ఉంచాలని భావిస్తున్నారు
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయం
లేబుల్స్లో ఎలాంటి మార్పులు చేయవచ్చు ?
ఏజెన్సీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరిన ఆబ్కారీశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యం, నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ను నియంత్రించడానికి అమలు చేస్తున్న లేబుల్స్ను.. బీరు సీసాలకు కూడా అతికించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ‘ఎక్సైజ్ అడ్హెసివ్ లేబుల్స్ (ఈఏఎల్)’గా పిలిచే ఈ స్టిక్కర్ల ను ప్రతి మద్యంసీసాపై అతికిస్తారు. అయితే ప్రస్తుతం అతికిస్తున్న ఈలేబుళ్ల కంటే అధునాతనంగా ఎలాంటి విధానాన్ని అమలు చేయవచ్చనే దానిపై ఆబ్కారీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో మద్యం సీసాలపై ఎలాంటి లేబుళ్లు వేస్తున్నారు? వాటి ప్రత్యేకతలు, ఆ మద్యం ఉత్పత్తి నుంచి సరఫరా దాకా ఎలా ట్రాకింగ్ చేస్తున్నారనేది పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త లేబుళ్లు, ట్రాక్ అండ్ ట్రేస్ సాఫ్ట్వేర్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ఈ నెల 9న టెండర్ ప్రకటన కూడా జారీ చేశారు.
లేబుల్పై బార్ కోడ్తో..
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, 1,176 బార్లు ఉన్నాయి. వీటిలో ఏటా 3.6 కోట్ల కాటన్ల లిక్కర్, 5 కోట్ల కాటన్ల బీర్లను విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) వంటివాటిని అరికట్టడం కోసం ప్రతి మద్యం సీసాపై లేబుల్ వేస్తారు. టెండర్ పొందిన ఏజెన్సీలు ఆ లేబుళ్లను మద్యం కంపెనీలకు సరఫరా చేస్తాయి. ఈ లేబుళ్లపై ప్రత్యేక బార్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ మద్యం ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి దుకాణానికి సరఫరా వరకు (ట్రాక్ అండ్ ట్రేస్) వివరాలన్నీ తెలుస్తాయి. ఈ లేబుళ్ల సరఫరా కోసం 2010లో టెండర్లు పిలిచి ఓ ఏజెన్సీకి బాధ్యత అప్పగించారు. 2022లో టెండర్ పిలిచినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. మద్యం సీసాలపై వేసే లేబుల్స్ కోసం కంపెనీలు ప్రతి నెలా రూ.18 కోట్ల వరకు భరిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో లేబుల్ కోసం మద్యం కంపెనీలు 30పైసలు ఆబ్కారీ శాఖకు చెల్లిస్తుండగా.. ఆబ్కారీ శాఖ సంబంధిత ఏజెన్సీకి 22పైసల చొప్పున ఇస్తోంది. ఇన్నేళ్ల తర్వాత లేబుళ్ల సరఫరా కోసం టెండర్లు నిర్వహించడానికి ఆబ్కారీశాఖ చర్యలు చేపట్టింది. బీరు సీసాలకూ లేబుల్స్ వేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటి ఖర్చు రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News