Bhupalpally: నీటిలో విషం కలిపిన టీచర్పై హత్యాయత్నం కేసు
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:07 AM
తాగునీటిలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్పై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఉద్యోగం నుంచి తొలగింపు
భూపాలపల్లిటౌన్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): తాగునీటిలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్పై హత్యాయత్నం కేసు నమోదైంది. అతడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలనుసారం ఈ చర్యలు తీసుకున్నట్టు డీఎస్పీ సంపత్రావు తెలిపారు. మరోవైపు రాజేందర్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 21 రాత్రి తాగునీటి ట్యాంకులో ఉపాధ్యాయుడు రాజేందర్ గడ్డి మందు కలిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హాస్టల్ ప్రత్యేక అధికారిపై నెపాన్ని నెట్టేందుకు కుట్ర చేసినట్లు తేలింది.ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థులపై విష ప్రయోగానికి పాల్పడిన రాజేందర్ను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా అఽధ్యక్షుడు దిలీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.