Share News

Hyderabad: గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:48 AM

గంజాయి ముఠాను పట్టుకోవడానికి వెళ్లిన ఓ ఎస్‌వోటీ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad: గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్‌ మృతి

  • తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వైనం

జీడిమెట్ల, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): గంజాయి ముఠాను పట్టుకోవడానికి వెళ్లిన ఓ ఎస్‌వోటీ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ మచిలీపట్నానికి చెందిన వి.ప్రవీణ్‌ కుమార్‌ (33) నగరంలోని బాలానగర్‌జోన్‌లో ఎస్‌వోటీ కానిస్టేబుల్‌గా విఽధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఓ గంజాయి ముఠా పెద్దఎత్తున గంజాయిని విక్రయిస్తుందని తెలుసుకున్న ఎస్‌వోటీ అధికారులు.. ప్రవీణ్‌తో పాటు సాయిలు, శంకర్‌ అనే కానిస్టేబుళ్లను చింతల్‌ ఎన్‌టీఆర్‌నగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి పంపించారు.


గంజాయి బ్యాచ్‌ కోసం కాపు కాసి ఉన్న ప్రవీణ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సాయిలు, శంకర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రవీణ్‌కు భార్య జానకిదేవి, ఒక కుమారుడు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 03:48 AM