SLBC Project: ప్రశ్నార్థకంగా ఎస్ఎల్బీసీ?
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:13 AM
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, వేయికి పైగా గ్రామాలకు తాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు..
ఇప్పటికే రూ.2,689 కోట్ల వ్యయం
ప్రాజెక్టు పూర్తికి మరో 1948 కోట్లు అవసరం
సహాయక చర్యలు పూర్తయితేనే.. నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): టన్నెల్ పైకప్పు కూలడంతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎ్సఎల్బీసీ) ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది..! ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, వేయికి పైగా గ్రామాలకు తాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు.. ఆది నుంచి నత్తనడకన సాగుతున్నాయి. అమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును 43.930 కిలోమీటర్ల మేర టన్నెల్గా చేపట్టారు. తాజా ప్రమాదంతో ఇన్లెట్ నుంచి తవ్వే టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) పరిస్థితి ఎలా ఉందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ టీబీఎం పూర్తిస్థాయిలో దెబ్బతింటే.. దాని స్థానంలో కొత్తదాన్ని తెప్పించేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. మూడేళ్ల క్రితం ఔట్లెట్ వైపు బేరింగ్ దెబ్బతినగా.. కొత్తదాన్ని తెప్పించడానికి ఏడాది సమయం పట్టిందని, ప్రస్తుతం ఆ బేరింగ్ చెన్నై పోర్టులో ఉందని ఇంజనీర్లు గుర్తుచేస్తున్నారు. రెండువైపులా టన్నెల్ పనుల్లో ఇంకో 9.56 కిలోమీటర్లు పూర్తయితే.. ప్రాజెక్టు కొలిక్కి వస్తుంది. అయితే.. 2019 నుంచి ఊటనీరు, మట్టి/రాళ్లు కూలడం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. దాంతో.. సిమెంట్, పాలియేరిథిన్ గ్రౌటింగ్ చేయిస్తూ ముందుకు సాగడంతో పనులు నెమ్మదించాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ.2,259 కోట్లు ఖర్చయ్యాయి. ఎస్ఎల్బీసీ పూర్తవ్వడానికి మరో రూ.1,948 కోట్లు అవసరం అని అంచనా. అయితే.. తాజా ప్రమాదంతో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది. సహాయక చర్యలు పూర్తయితేనే ఇది సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టన్నెల్కు ఆడిట్ పెట్టాలి: ఇంజనీరింగ్ నిపుణులు
ఈ ప్రమాదంతోనైనా సహాయక చర్యల్లో భాగంగా కేంద్ర అటవీశాఖ అత్యవసర అనుమతి తీసుకొని ఒక టన్నెల్ యాడిట్ను ఏర్పాటు చేయాలి. ఈ విధానంతో నిరంతరం టన్నెల్ను పరిశీలించడం.. మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుంది. తాజా ప్రమాదంలో టన్నెల్ టీబీఎం దెబ్బతింటే.. ప్రాజెక్టు పూర్తవ్వడానికి మరింత సమయం పట్టవచ్చు.
టీబీఎం తప్ప మరో మార్గం లేదు
టన్నెల్ను పూర్తి చేయడానికి టీబీఎంను వినియోగించడం తప్ప మరో మార్గం లేదు. ఇంత పెద్ద టన్నెల్కు బయటికి వెళ్లే ద్వారం(యాడిట్) లేకపోవడం ప్రధాన సమస్య. యాడిట్ ఉంటే సహాయక చర్యలకు ఇబ్బందులుండేవి కాదు. టన్నెల్ పూర్తయితే 4 వేల క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో తరలించడానికి అవకాశం ఉంటుంది. ఇన్లెట్ వైపు టీబీఎం పూర్తిస్తాయిలో దెబ్బతింటే.. దాని స్థానంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ప్రక్రియను చేపట్టాలి. అభయారణ్యంలో ఉండటం వల్ల.. యాడిట్ తప్పనిసరి.
- అశోక్కుమార్, మాజీ ఎస్ఈ
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News