Singareni: త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:33 AM
కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత రంగంలోకి సింగరేణి సంస్థ స్వయంగా గానీ, జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా గానీ త్వరలోనే ప్రవేశించనుందని సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు.
స్వాతంత్య్ర వేడుకల్లో సంస్థ సీఎండీ బలరాం వెల్లడి
కొత్తగూడెం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత రంగంలోకి సింగరేణి సంస్థ స్వయంగా గానీ, జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా గానీ త్వరలోనే ప్రవేశించనుందని సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు. సింగరేణి సంస్థను పదికాలాల పాటు నిలబెట్టడంతో పాటు, సంస్థ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.
ఇటీవలి కాలంలో పునరుత్పాదక ఇంధన వనరులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో బొగ్గుకు డిమాండ్ క్రమంగా తగ్గుతోందన్నారు. మరోవైపు, సింగరేణిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇక్కడి బొగ్గు ధర ఎక్కువగా ఉందని, సంస్థ నుంచి బొగ్గును కొంటున్న థర్మల్ పవర్ సంస్థలు వేరే సంస్థల వైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. ఆయా సంస్థలు వేరే చోటు నుంచి బొగ్గు కొనడానికి ప్రభుత్వాలు అనుమతిస్తే మున్ముందు సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ ఖనిజ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించినట్లు చెప్పారు.