Suspension: సూర్యాపేట ఆర్ అండ్ బీలో ఒకేసారి ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:37 AM
సూర్యాపేట రోడ్లు మరియు భవనాల(ఆర్ అండ్ బీ) శాఖ ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడింది.
విధి నిర్వహణ సమయంలో కార్యాలయంలో లేకపోవడంతో కలెక్టర్ చర్యలు
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట రోడ్లు మరియు భవనాల(ఆర్ అండ్ బీ) శాఖ ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణ సమయంలో కార్యాలయం లేకుండా పోయిన వివిధ హోదాల పని చేస్తున్న ఉద్యోగులపై ఆ జిల్లా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్పవార్.. సూర్యాపేట ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడుగురు అధికారులు కార్యాలయంలో లేకపోవడాన్ని గమనించారు.
సదరు ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి అనుమతి కూడా తీసుకోలేదని తెలిసి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆర్ అండ్ బీలో సీనియారిటీ ప్రకారం ఇటీవల వరుసగా పదోన్నతులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఏ.కిషన్రావు, కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ బి.లక్ష్మణ్, నల్లగొండ ఎస్ఈ బి.వెంకటేశ్వరరావు, నాణ్యతా విభాగం ఎస్ఈ ఎం.శ్రీనివాసరెడ్డికి చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.