High Court: ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లదు
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:07 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. చట్టబద్ధమైన డేటా లేకుండా వర్గీకరణ అమలు చేయడం చెల్లదని పిటిషనర్లు తెలిపారు
హైకోర్టులో మరో 2 పిటిషన్లు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సంపన్న శ్రేణి నిబంధనను అమలు చేయలేదని పేర్కొంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలయింది. దానికి తోడుగా.. చట్టబద్ధమైన డేటా ఏదీ లేకుండా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేపట్టిన వర్గీకరణ చెల్లదని పేర్కొంటూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఎస్సీ ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది డీవీ సీతారామ్మూర్తి వాదిస్తూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికకు చట్టబద్ధత లేదని తెలిపారు. దీనిపై సవివరంగా వాదనలు వినాల్సి ఉందన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది