Temple Donation: ఇష్ట దైవానికే భక్తుడి ఇల్లు..!
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:40 AM
ఆయన పేరు ఎం.వెంకటేశ్వర్లు.. ఒక విశ్రాంత ఉద్యోగి. ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఇంటిని యాదాద్రి-లక్ష్మి నరసింహా స్వామికి విరాళంగా అందజేశారు.
యాదాద్రి లక్ష్మి నరసింహుడికి ఇల్లు రిజిస్ట్రేషన్
ఇంటి విలువ రూ.4 కోట్లు
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆయన పేరు ఎం.వెంకటేశ్వర్లు.. ఒక విశ్రాంత ఉద్యోగి. ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఇంటిని యాదాద్రి-లక్ష్మి నరసింహా స్వామికి విరాళంగా అందజేశారు. హైదరాబాద్లోని తిలక్నగర్లో 152 గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 3- పెంట్ హౌస్ నిర్మించిన విలువ సుమారు రూ.4 కోట్ల పై మాటే. అంత విలువైన సొంతింటిని విశ్రాంత ఉద్యోగి ఎం.వెంకటేశ్వర్లు తన ఇష్ట దైవం యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి రాసిచ్చారు.
ఈ మేరకు చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం పేరిట గురువారం రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో దేవాలయ అధికారులకు అందజేశారు. స్వామి వారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన భక్తుడిని ఆలయ అధికారులు.. లక్ష్మినరసింహ స్వామి ప్రసాదం అందచేసి సన్మానించారు.