కాలనీలు.. కంపు కంపు
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:01 AM
దుర్గంధంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. మురుగునీటి కాల్వనిండి నెలరోజులవుతున్నా పట్టించుకోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది.
మురుగు కాల్వల్లో చెత్తాచెదారం
ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
తాండూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దుర్గంధంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. మురుగునీటి కాల్వనిండి నెలరోజులవుతున్నా పట్టించుకోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మున్సిపల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగుకాల్వ చెత్తాచెదారంతో నిండి ప్రవాహం నిలిచిపోయింది. తాండూరు పట్టణం భవానీనగర్లోని పలు కాలనీల్లో ప్రధానరోడ్డును అనుకొని ఉన్న రాయల్ కంట వద్ద, బీసీ కళాశాల విద్యార్థుల హాస్టల్ వద్ద, దర్గా ప్రాంతంలో, రాజీవ్కాలనీలో మురుగు కాల్వలు నిండి పోయాయి. దీంతో ఈగలు, దోమలతో రోగాలపాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్కాలనీలో మురుగునీరు ఏకంగా కిలోమీటర్ మేర పోరతోందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మురుగు కాల్వను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.