Share News

సెల్‌ఫోన్‌ దొంగల రిమాండ్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:29 PM

సెల్‌ఫోన్ల దొంగలను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు అరెస్టు చేసి శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.

సెల్‌ఫోన్‌ దొంగల రిమాండ్‌
వివరాలను వెల్లడిస్తున్న పోలీసులు

  • రూ. 11.75లక్షలు విలువ చేసే ఫోన్లు, సామగ్రి స్వాధీనం

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్ల దొంగలను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు అరెస్టు చేసి శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 3వ తేదీన పోచారం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని అన్నోజిగూడ అయ్యప్పస్వామి ఆలయం సమీపంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి మొబైల్‌ దుకాణం షెట్టర్‌ పగులగొట్టి సెల్‌ఫోన్లు అపహంరించుకెళ్లిన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురి నిందితులను నారపల్లిలోని నందనవనం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజస్థాన్‌కు చెందిన ప్రభాత్‌సింగ్‌, నేపాల్‌సింగ్‌, ప్రవీణ్‌సింగ్‌, తరుణ్‌పాల్‌సింగ్‌లుగా గుర్తించారు. వీరు నగరంలోని బేగంబజార్‌లో ఉంటూ ఆటోడ్రైవింగ్‌ చేస్తుంటారు. తరుణ్‌పాల్‌సింగ్‌తో కలిసి జల్సాల కోసం డబ్బులు సంపాందించాలని దొంగతనాల బాటపట్టినట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో సెల్‌ఫోన్ల దుకాణాలను ఎంచుకొని షెట్టర్లు పగులగొట్టి సెల్‌ఫోన్లు దొంగతనాలు చేస్తుంటారు. నిందితుల వద్ద నుంచి 60 సెల్‌ఫోన్లు, ఒక టీవీ, సీసీటీవీ మానిటర్‌ 1, ఫోన్ల సామాగ్రి మొత్తం రూ. 11,75,533 విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాలుగురోజుల్లో సెల్‌ఫోన్‌ నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులను, సిబ్బందిని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు.

Updated Date - Feb 08 , 2025 | 11:29 PM