Rajiv Swagriha Corporation: రాజీవ్ స్వగృహ ప్లాట్లకు భారీ స్పందన
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:35 AM
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఓపెన్ ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ప్లాట్ల అమ్మకాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
కుర్మల్గూడలో 15 ప్లాట్లకు రూ. 9.6 కోట్లు
నేడు, రేపు కొనసాగనున్న వేలం
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఓపెన్ ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ప్లాట్ల అమ్మకాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడలో (శ్రీశైలం హైవే, తుక్కుగుడ సమీపంలో) 15 ప్లాట్లు అమ్ముడయ్యాయి. మధ్యతరగతి వారికి అనువైన 260- 300 చదరపు గజాల విస్తీర్ణంలోని ఈ ప్లాట్లను సొంతం చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపారు. ప్రభుత్వం చదరపు గజానికి కనీస ధర రూ.20 వేలు నిర్ణయించగా, వేలంలో అత్యధికంగా చదరపు గజానికి రూ. 28,500 పలికింది.
ఈ వేలం పాటలో 34 మంది పాల్గొనగా, రూ. 9.6 కోట్ల ఆదాయం వచ్చినట్లు రాజీవ్ స్వగృహ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బహదూర్పల్లిలోని 68 ఓపెన్ ప్లాట్లు, బుధవారం రంగారెడ్డి జిల్లా తొర్రూర్లోని 200-500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు.