Gaddam Vivek: వివేక్కు గనులు, ఉపాధి కల్పన
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:46 AM
ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. గడ్డం వివేక్ వెంకటస్వామికి గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్థకంతోపాటు..
అడ్లూరికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం
వాకిటికి పశుసంవర్థకం, యువజన, క్రీడలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు లేవు
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. గడ్డం వివేక్ వెంకటస్వామికి గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్థకంతోపాటు.. యువజన, క్రీడల శాఖ.. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమంతోపాటు.. ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను కేటాయించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం జీవో-131ని విడుదల చేసింది. కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వెంటనే శాఖలు కేటాయింపు జరగకపోవడంపై ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు నేపథ్యంలో ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోందని, అందుకే సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ తన వద్ద ఉన్న శాఖల్లోంచే కొత్తవారికి సర్దుబాటు చేశారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా.. మునిసిపల్, హోం, విద్య, మరికొన్ని శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. తదుపరి జరిగే మంత్రివర్గ విస్తరణ తర్వాత.. సీఎం ఈ శాఖలను కొత్త మంత్రులకు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ శాఖలున్నాయి. కొత్త మంత్రులకు కూడా అదే తరహాలో కేటాయింపులు చేయడం గమనార్హం..! కొత్తగా రాష్ట్రమంత్రి వర్గంలోకి వచ్చిన గడ్డం వివేక్ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన తండ్రి గడ్డం వెంకటస్వామి(కాకా) కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వివేక్ అన్న.. ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.. కాంగ్రెస్ హాయాంలో రాష్ట్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వివేక్ కూడా అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం..!
ఊపిరి పీల్చుకున్న సీనియర్లు
రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ఏర్పడిన తరువాత సీఎం మినహా 11 మందితో మంత్రివర్గం కొలువుదీరింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై తీవ్ర చర్చ జరిగినా.. అదిగో-ఇదిగో అంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. చివరికి ముగ్గురు కొత్త మంత్రులను నియమించారు. దీని వెనక భారీ కసరత్తే జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుని, కొత్త మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు పేర్కొంటున్నాయి.అయితే.. కొత్త మంత్రుల రాకతో.. పాతవారి శాఖల్లో మార్పులుంటాయని ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేకపోవడంతో సీనియర్లుఊపిరి పీల్చుకున్నారనే చర్చ జరుగుతోంది.
తదుపరి విస్తరణపై చర్చ
కొత్త మంత్రుల శాఖల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో.. తదుపరి విస్తరణ ఎప్పుడనే చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ముగ్గురికే అవకాశం కల్పించారు. ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది. దీంతో.. రెండో విడత విస్తరణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.