Share News

ఏసీబీకి పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:52 AM

ములుగు, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లంచం అడిగిన ఒక అధికారి, ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఏసీబీకి పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు

  • ఉపాధ్యాయుడిని లంచం అడిగిన ములుగు డీఈఓ, సీసీ

  • ఇంటి నంబర్‌ జారీకి డబ్బులివ్వాల్సిందేన్న గ్రామ కార్యదర్శి

ములుగు/ మునిపల్లి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ములుగు, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లంచం అడిగిన ఒక అధికారి, ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు. గత ఏడాది జూన్‌లో ప్రమాదానికి గురైన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పూర్తిగా నయమైన తర్వాత గత అక్టోబరులో విధులకు హాజరయ్యేందుకు వచ్చాడు. అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి డీఈవో పాణి రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.


వారి సూచన మేరకు డీఈఓ పాణికి రూ.15వేలు, డీఈవో సీసీ వేణుకు రూ.5,000 సదరు టీచర్‌ ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండల వాసి ఒకరు.. మునిపల్లి మండలం బుదేరా గ్రామ చౌరస్తాలో వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ కోసం షెడ్డు, ఓపెన్‌ ప్లాట్‌కు ఇంటి నంబర్‌ కోసం పంచాయతీ కార్యదర్శి పటోళ్ల నాగలక్ష్మిని సంప్రదించగా.. రూ.12 వేలు లంచమడిగినా రూ.8,000లకు ఒప్పందం కుదిరింది. సోమవారం నాగలక్ష్మికి రూ.8,000 నగదు అందజేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ మెదక్‌ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 04:52 AM