Share News

మహిళలకు ఆర్థిక అక్షరాస్యత అవసరం

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:52 AM

మహిళలకు ఆర్థిక అక్షరాస్యత అవసరమని అదనపు కలెక్టర్‌(స్ధానిక సంస్థలు) కే.గంగాధర్‌ అన్నారు. మహిళల ఆర్థిక వృద్ధి మంచి సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు.

మహిళలకు ఆర్థిక అక్షరాస్యత అవసరం

అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) కే.గంగాధర్‌

భువనగిరి (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఆర్థిక అక్షరాస్యత అవసరమని అదనపు కలెక్టర్‌(స్ధానిక సంస్థలు) కే.గంగాధర్‌ అన్నారు. మహిళల ఆర్థిక వృద్ధి మంచి సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాన్ని (ఫైనాన్షియల్‌ లిటరసీ వీక్‌)ను కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత-మహిళల శ్రేయస్సుపై ఈ సంవత్సరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ఆర్థిక అక్షరాస్యతపై కీలక పాత్ర వహించేలా ప్రోత్సహిస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కలెక్టరేట్‌ పరిసరాల్లో మహిళ లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మెప్మా పీడీ రమేష్‌, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరు శివరామకృష్ణ, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా విజిలెన్స్‌ ఆఫీసరు మందడి ఉపేందర్‌ రెడ్డి, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పది పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ జీ. వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఈవో సత్యనారాయణతో కలిసి సోమవారం జిల్లాలోని విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి జిల్లా విద్యాధికారి, కలెక్టర్‌కు సమాచారం అందజేయాలన్నారు. సమీక్షలో ఏసీజీఈ రఘురాం రెడ్డి, తదితరులున్నారు.

సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలి

రైస్‌ మిల్లర్లు వారికి నిర్దేశించిన సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ జీ.వీరారెడ్డి అన్నారు. సీఎంఆర్‌ బియ్యం సేకరణపై సోమవారం ఆయన చాంబర్‌లో జిల్లాలోని రైస్‌ మిల్లర్లతో సమావేశమయ్యారు. రబీ సీజన్‌ 2023-24 సీఎంఆర్‌ బియ్యం 85 శాతం సేకరించారని, మిగిలిన 15 శాతం మార్చి 17 లోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కే.వనజాత, రోజారాణి పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 12:52 AM