మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:52 AM
మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
భువనగిరి (కలెక్టరేట్), జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కొత్త విద్యుత్ పాలసీ కోసం ఇంధనశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ మధ్య కుదిరిన ఒప్పందంతో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూములను గుర్తించి, ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఒక మెగావాట్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల భూమి అవసరమని, ప్రతీ జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా సేకరించాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్మాల్స్కేల్, మైక్రో ఇండస్ట్రీల ఏర్పాటుకు నాలుగు నుంచి ఐదెకరాలు అవసరమని, ఇక్కడ ఎస్హెచ్జీ సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు 2 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసుకునేందుకు పీఎం కుసుమ్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకొని కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి తోడ్పాటు అందించాలన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాలో స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేశామని తెలిపారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సర్వే నంబరు 452, 453లో 15.33 ఎకరాలు ఎంపిక చేసి మిగతా ప్రక్రియ కోసం సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధీర్, డీఈ శ్రీనివా్సచారి, గ్రామీణాభివృద్ధి అదనపు అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ఆర్ నిర్వాసితుల పరిహారం కొలిక్కి?
నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం
భువనగిరి (కలెక్టరేట్), జనవరి 8 (ఆంధ్రజ్యో తి): రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) నిర్వాసితుల కు చెల్లించే పరిహారం విషయం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసిం ది. ఈ మేరకు బుధవారం ట్రిపుల్ఆర్ నిర్వాసితులై న తుర్కపల్లి మండలం దత్తాయపల్లికి చెందిన రైతులతో కలెక్టర్ హనుమంతరావు సమావేశమయ్యారు. దత్తాయపల్లి రెవెన్యూ పరిధిలో 58 మంది రైతులకు చెందిన 76ఎకరాల భూసేకరణ, పరిహారంపై వారితో కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వం తీసుకుంటున్న భూమికి బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని, లేదంటే భూమికి భూమి ఇవ్వాలని రైతులు కోరగా, ప్రభుత్వ నిర్ణయం మేరకు పరిహారం ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించే ధరతో తాము నష్టపోతామని ఎకరాకు రూ.80లక్షలు ఇవ్వాలని రైతులు కోరగా, చివరికి రూ.35లక్షల నుంచి రూ.40లక్షల వరకు చెల్లించేలా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు,