డీఎస్పీ కార్యాలయం మంజూరెప్పుడో
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:12 AM
హుజూర్నగర్ కేంద్రంగా పోలీస్ డివిజన ఏర్పాటుపై ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు.
హుజూర్నగర్ కేంద్రంగా పోలీస్ డివిజన ఏర్పాటుపై ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ స్థానానికి జరిగిన ప్రతీ ఎన్నికల్లో పోలీస్ డివిజన ఏర్పాటు ఎన్నికల అంశంగా నిలిచింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై హామీలు గుప్పించారు. 2020 జూన్ 29న అప్పటి మంత్రి కేటీఆర్ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పుడే డీఎ్సపీ కార్యాలయాన్ని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల సీఎం రేవంతరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నూతన పోలీ్సస్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పోలీస్ డివిజనపై కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-హుజూర్నగర్)
హజూర్నగర్ డివిజన్లో డివిజన్లో పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, చింతలపాలెం మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో కలిపి సుమారు 2,53,113 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,22,664 మంది, మహిళలు 1,30,432 మంది, ట్రాన్స్జెండర్స్ 17 మంది ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే జనాభాకు అనుగుణంగా కొత్త పోలీ్సస్టేషన్లు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అయితే జనాభా పెరగడంతో కొత్త మండలాలతో పాటు పంచాయతీల సంఖ్యా పెరిగింది. ప్రతీ మండలంలో 30 నుంచి 40 వేల మంది ఓటర్లు ఉండగా వాటికి అనుగుణంగా పోలీ్సస్టేషన్లను పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ డివిజన్ ప్రాధాన్యాన్ని గుర్తించి డీఎ్సపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండు సర్కిల్ కార్యాలయాలకు డిమాండ్లు
ప్రస్తుతం హుజూర్నగర్లో సీఐ కార్యాలయం ఉంది. సీఐ పరిధిలో గరిడేపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల, మఠంపల్లి, హుజూర్నగర్ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మిగిలిన మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాలు కోదాడ రూరల్ సర్కిల్ పోలీ్సపరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు మండలాలను కలిపి హుజూర్నగర్లో డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు మరో రెండు సర్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు ప్రజల నుంచి వస్తున్నాయి. మేళ్లచెర్వు, చింతలపాలెం, మఠంపల్లి మండలాలను కలిపి ఒక
సర్కిల్ కార్యాలయం, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాలను కలిపి నేరేడుచర్ల సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటున్నారు. అదేవిధంగా హుజూర్నగర్ టౌన్, రూరల్ మండలాలను కలిపి హజూర్నగర్ సర్కిల్ కార్యాలయాన్ని విభజించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మొత్తం మూడు సర్కిల్ కార్యాలయాలతో పాటు మహిళా, ట్రాఫిక్ పోలీ్సస్టేషన్లను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఆయా పోలీస్ కార్యాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
డీఎస్పీ కార్యాలయాన్ని
ఏర్పాటుచేయాలి
హుజూర్నగర్లో డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 2019 ఉపఎన్నిక సమయంలో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని 100 మంది న్యాయవాదులు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించారు. అప్పటి సీఎం కేసీఆర్ రెండు కార్యాలయాలను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి కేవలం ఆర్డీవో కార్యాలయం మాత్రమే మంజూరుచేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాలయాపన చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి కక్షిదారులు సత్వర సేవలు పొందేందుకు సహకారం అందించాలి.
కాలువ శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది