చెర్వుగట్టుపై అసలేం జరుగుతోంది ?
ABN , Publish Date - Feb 25 , 2025 | 12:56 AM
జిల్లాలో ప్రసిద్ద శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. నల్లగొండ ఆర్డీవో రెండు సార్లు ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు మళ్లీ వస్తానని రికార్డులు తనిఖీ చేస్తానని చేసిన ప్రకటనతో ఈ చర్చ మరింత పెరిగింది.
ఆర్డీవో ఆకస్మిక తనిఖీతో సిబ్బందిలోనూ చర్చ
నార్కట్పల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ద శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. నల్లగొండ ఆర్డీవో రెండు సార్లు ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు మళ్లీ వస్తానని రికార్డులు తనిఖీ చేస్తానని చేసిన ప్రకటనతో ఈ చర్చ మరింత పెరిగింది. దేవస్థానంలో ఇటీవల పూ ర్తయిన ఉత్సవాల ఏర్పాట్ల నిమిత్తం నిర్వహించిన సన్నాహక సమావేశం రోజునే కొందరు కలెక్టర్కు పలు అంశాలపై ఫిర్యాదు చేయగా దాని పర్యవసానమే ఆర్డీవో రికార్డుల తనిఖీ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రధానంగా వివిధ టెండర్ల నిర్వహణ... బకాయిల పైనే ప్రధానంగా ఫిర్యాదులు వచ్చేవి. ఇపుడు ప్రతీ విభాగానికి సంబంధించి క్షుణ్ణంగా ఆర్డీవో రికార్డులు పరిశీలించడం వెనుక అసలు మతలబు ఏమిటనేది ప్రశ్నగా మారింది. దేవస్థానంలో నిర్వహించిన కొన్ని టెండర్లు ఒకే వ్యక్తికి రావడంపై కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. సివిల్ కాంట్రాక్టర్ లైసెన్సు ఉన్న వ్యక్తికి జాతర లైటింగ్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారంటూ టెండరు వేసిన పోటీదారుల్లో అర్హత గల ఓ టెండరు దారుడు ప్రశ్నించి పై అధికారులకు కూడా మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అప్పుడు డీఆర్డీఏ పీడీ: గతంలో కలెక్టర్గా నారాయణరెడ్డి ఉన్నప్పు డు కూడా ఇదే రకమైన ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో చెర్వుగట్టు క్షేత్రంపై దృష్టి పెట్టిన నారాయణరెడ్డి డీఆర్డీఏ పీడీ శేఖర్రెడ్డికి చెర్వుగట్టు పర్యవేక్ష ణ బాధ్యతలకు సంబంధించి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయన ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి దేవస్థాన నిర్వహణ లోపాలను గుర్తించారు. రెండు పర్యాయాలు ప్రత్యేకంగా ఆలయాన్ని సందర్శించి దేవస్థాన పాలనా వ్యవహారాల్లో కొంత మార్పులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీనికి తోడు కలెక్టర్ నారాయణరెడ్డి కూడా రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.
ఇప్పుడు ఆర్డీవో: ప్రస్తుతం దేవస్థానంలో పాలన గాడితప్పి అవకతవక లు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో గత కలెక్టర్ నారాయణరెడ్డి మాదిరిగానే ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఆర్డీవోను పంపి రికార్డులను తనిఖీ చేయాలని ఆదేశించింది. రెగ్యులర్ సిబ్బంది తక్కువగా ఉండటంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నారు. ఈ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు అధికారులకు చేరాయి. దీంతో రికార్డుల తనిఖీ సమయంలో తన దృష్టికి వచ్చిన రికార్డుల నిర్వహణ తీరును ఆర్డీవో నోట్ చేసుకున్నారు. కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే ఆ తప్పుకు బాధ్యత వహించాల్సి వస్తుందన్న విషయం తెలియదా అంటూ ఆర్డీవో వ్యాఖ్యానించడం పై ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థాన సిబ్బందిలో నెలకొంది.