అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:21 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

పథకాల అమలు నిరంతర ప్రక్రియ
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలుగుండాల, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గుండాల మండలకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిందన్నారు. మరో నాలుగు పథకాలు అమలు చేయనున్నట్లు రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు అందుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీఏ నాగిరెడ్డి, తహసీల్దార్ జలకుమారి, ఎంపీడీవో శంకరయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇందిరమ్మ స్ట్రక్చర్ హౌస్ ఏర్పాటుకోసం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు రక్తనమూనాలను ఎయిమ్స్కు పంపించేందుకు డ్రోన్ సేవలను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతు రావు యునాని మందులను పరిశీలించారు.
పలు అభివృద్ది పనులకు శంకుస్థాన
గుండాల మండలకేంద్రంలోని రూ.50లక్షలతో నూతన గ్రంథాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ శంకుస్థాపన చేశారు. గుండాల, వంగాల, నూనేగూడెం, మాసాన్పల్లి, సీతారాంపురం, అనంతారం తదితర గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.