రామలింగేశ్వరుడికి లక్ష పుష్పార్చన
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:47 AM
నార్కట్పల్లి, జనవరి 29(ఆంధ్రజ్యోతి) మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామ లింగేశ్వర స్వామి దేవస్థానంపై లక్ష పుష్పార్చన బుధవారం ఘనంగా నిర్వహించారు

నార్కట్పల్లి, జనవరి 29(ఆంధ్రజ్యోతి) మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామ లింగేశ్వర స్వామి దేవస్థానంపై లక్ష పుష్పార్చన బుధవారం ఘనంగా నిర్వహించారు. మౌని అమావాస్యకు ప్రత్యేకత ఉండటంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వాహనాలు, బస్సుల ద్వారా చేరుకున్నారు. రద్దీ దృష్ట్యా వాహనాలను ఘాట్రోడ్పై అనుమతించ లేదు. పార్కింగ్ ప్రదేశాల్లోనే ఆపి ఆటోల్లో పైకి చేరారు. కాగా గర్భాలయం నుంచి మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శివ పార్వ తుల ఉత్సవ మూర్తులను మహా మంటపానికి చేర్చారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సహార్చకులు సతీశ్ శర్మ, సురేశ్శర్మలచే పుష్పాలకు పూజాధి కాలు నిర్వహించి ఉత్సవ మూర్తులను అభిషేకించారు. స్వామి పాదాల చెంత పూజల నందుకున్న పుష్పాల కోసం భక్తులు ఎగబ డ్డారు. స్వామి వారి పుష్కరిణిలో పుణ్య స్నానమాచరించి భక్తులు పార్వతీ జడల రామలింగేశ్వరుడితో పాటు గుట్టపైన ఉన్న ఉపాలయాలు, గుట్ట కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. గుమ్మడి కాయ ల పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. మౌని అమావాస్య కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక కనిపించింది. దేవస్థాన ఈవో సిరికొండ నవీన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.