మందులు, చికిత్సతో కుష్ఠు నియంత్రణ
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:40 AM
మందులు, చికిత్సలతో కుష్ఠు వ్యాధి నివారణ సాధ్యమని కుష్ఠు వ్యాధి నియంత్రణ జిల్లా అధికా రి డాక్టర్ టి.సాయిశోభ అన్నారు. గురువారం భువనగిరిలో ఆమె పక్షోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు.

కుష్ఠు వ్యాధి నియంత్రణ జిల్లా అధికారి సాయిశోభ
జిల్లాలో ప్రారంభమైన కుష్ఠు అవగాహన పక్షోత్సవాలు
భువనగిరి టౌన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మందులు, చికిత్సలతో కుష్ఠు వ్యాధి నివారణ సాధ్యమని కుష్ఠు వ్యాధి నియంత్రణ జిల్లా అధికా రి డాక్టర్ టి.సాయిశోభ అన్నారు. గురువారం భువనగిరిలో ఆమె పక్షోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. కుష్ఠు వ్యాధి లక్షణాలపై ముందస్తు అవగాహన పెంచుకోవాలని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సిబ్బంది లేదా ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలన్నారు. వ్యాధితో ఆందోళనకు గురికావద్దన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల పై మహాత్మాగాంధీ చూపిన ఆదరణను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలోని 21 ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో కుష్ఠు వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించినట్లు, 15రోజులపాటు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ వైద్యాధికారి నిరోషా, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, పారా మెడికల్ సిబ్బంది ఆర్.రవీందర్రెడ్డి, పి.రాములు, కే.మాధవి, బి.బసవరాజ్, అజ్మీర్, రమేష్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.