Share News

ఆసుపత్రుల అభివృద్ధి కమిటీలేవీ?

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:47 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పనలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు కృషి చేస్తాయి.

ఆసుపత్రుల అభివృద్ధి కమిటీలేవీ?

ఏడాదిగా ఏర్పాటు కాని నూతన కమిటీలు

పరిష్కారానికి నోచుకోని మౌలిక వసతులు

భువనగిరి (కలెక్టరేట్‌), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పనలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు కృషి చేస్తాయి. మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి ఆసుపత్రుల పరిధిలో చేపట్టాల్సిన పనులు, ఖర్చు చేయాల్సిన నిధులు ఇతరత్రా అంశాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో చర్చించి నివేదికలను పె ౖఅధికారులకు విన్నవిస్తారు. కమిటీలు పంపిన వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తారు. ఏడాదిగా ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆసుపత్రుల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కానికి నోచుకోవడం కావడం లేదు.

జిల్లా ఆసుపత్రిలో..

వైద్య విధాన పరిషత్‌ పరిధిలో సేవలందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్ర ంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఏడాదిన్నర క్రితం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిగా మార్చారు. జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలకు సంబంధించిన సూపరింటెండెంట్‌ను నియమించడంతో కళాశాలకు చెందిన వైద్యులు, నర్సులు వైద్య సిబ్బంది ఇక్కడ సేవలు అందిస్తున్నారు.

ప్రజాప్రతినిధులే చైర్మన్లుగా..

ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజా ప్రతినిధులే చైర్మన్లుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరిస్తారు. జిల్లా ఆసుపత్రులకు జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గ కేంద్రాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు స్థానిక ఎమ్మెల్యేలు మునిసిపల్‌ చైర్మన్లు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలకు చైర్మన్లుగా ఎంపీపీలు వ్యవహరిస్తారు. పరిషత్తుల పదవీకాలం అయిపోయి ఆరు మాసాలు గడిచింది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తే ఆయా ఆసుపత్రుల్లోని సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రుల వివరాలు ఇలా..

జిల్లా ఆసుపత్రి: 1

సామాజిక ఆరోగ్య కేంద్రాలు: 3

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు: 20

అర్బన్‌ పీహెచ్‌సీ: 1

బస్తీ దవాఖానాలు: 3

పల్లె దవాఖానాలు: 99

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో..

జిల్లా పరిధిలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్న నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో భువనగిరి మినహా మూడు ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిలో ఆలేరు, చౌటుప్పల్‌, రామన్నపేట ఆసుపత్రులుండగా ఆలేరు సిహెచ్‌సీ ఆలేరు నియోజకవర్గంలో, చౌటుప్పల్‌ సీహెచ్‌సీ మునుగోడు నియోజకవర్గంలో రామన్నపేట ఏరియా ఆసు పత్రి నకిరేకల్‌ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఆయా ఆసుపత్రుల అభివృద్ధి కమిటీలకు ఆయా ఎమ్మెల్యేలు చైర్మన్లుగా వ్యవహరించాల్సి ఉంది.

అంతంత మాత్రంగానే నిధులు..

సర్కారు దవాఖానలకు అంతంత మాత్రంగానే నిధులను కేటాయిస్తున్నారని, సరిపడా నిధులు మంజూరు కాకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు, వైద్యాధికారులు పేర్కొంటున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యేలు, జిల్లా ఆసుపత్రికి కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు. పీహెచ్‌సీలకు ఏడాదికి రెండుసార్లు నిధులు కేటాయిస్తారు. అభివృద్ధి కమిటీ సూచనలతో ఈ నిధులను ఆసుపత్రి అవసరాలకు వినియోగిస్తారు. కానీ రెండు సంవత్సరాలుగా ఎలాంటి నిధులు మంజూరు కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

రెండేళ్లుగా నిధులు మంజూరు కాలేదు

గడిచిన రెండేళ్లుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు మంజూరు కాలేదు. అభివృద్ధి కమిటీలతో ఆసుపత్రుల్లో నెలకొన్న పలు సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వైద్య సేవలకు అంతరాయం కలుగకుండా విధులు నిర్వహించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

-డాక్టర్‌ ఎం.మనోహర్‌, జిల్లా వైద్యాధికారి

Updated Date - Jan 07 , 2025 | 12:47 AM