10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తా
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:22 AM
పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తానని కేజీబీవీ విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ హామీపత్రం రాసి ఇచ్చారు.

విద్యార్థినులకు హామీపత్రం రాసిచ్చిన కలెక్టర్
నల్లగొండ జిల్లా కనగల్ కేజీబీవీలో ఘటన
కనగల్, ఫిబ్రవరి 12 (ఆంద్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తానని కేజీబీవీ విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ హామీపత్రం రాసి ఇచ్చారు. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లాలోని కనగల్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారితో సెల్ఫీ తీసుకున్నారు. బాలికలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే వారు ఇప్పటినుంచే ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవాలని సూచించారు. అవసరమైన స్టడీమెటీరియల్ను త్వరలోనే పాఠశాలకు పంపిస్తానని తెలిపారు. ఇక పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తే విజయవాడ, చెన్నై వంటి నగరాలకు విమాన ప్రయాణం చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈమేరకు విద్యార్థినులకు హామీ పత్రం కూడా రాసిచ్చారు.