Jana Reddy: నాకూ సీఎం పదవి మిస్సయింది
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:38 AM
రాజకీయాల్లో కొన్నిసార్లు ఆశించినవన్నీ జరగకపోవచ్చునని, తానకు సీఎం పదవి దక్కాల్సి ఉన్నా మిస్సయిందని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.
రాజకీయాల్లో ఆశించినవన్నీ జరగకపోవచ్చు: జానారెడ్డి
నాగార్జునసాగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో కొన్నిసార్లు ఆశించినవన్నీ జరగకపోవచ్చునని, తానకు సీఎం పదవి దక్కాల్సి ఉన్నా మిస్సయిందని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియామకమైన కొండేటి మల్లయ్యకు సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పట్టణంలో కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు నిర్వహించారు.
ఈ సందర్భంగా జానారెడ్డి జర్నలిస్టులతో చిట్చాట్గా మాట్లాడారు. కొండేటి మల్లయ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో తన అనుచరుడిగా ఉన్నారని ఈక్రమంలో ఆయనకు ఎమ్మెల్యే సీటు రావల్సి ఉనప్పటికీ అది దక్కలేదని తెలిపారు. తనకు కూడా సీఎం పదవి దక్కాల్సినప్పటికీ అది రాలేదన్నారు. రాజకీయాల్లో కొన్నిసార్లు అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. తమ అందరి ఆశీర్వాదం, అభిమానంతో ఎప్పటికైనా మల్లయ్య ఉన్నత పదవిని పొందుతారని జానారెడ్డి అన్నారు.