Mahesh Kumar Goud: బీసీల రిజర్వేషన్ కోసమే స్థానికం ఆలస్యం
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:44 AM
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50ు పరిమితి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎప్పుడో దాటిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.
42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలన్నదే కాంగ్రెస్ ఆలోచన
తెలంగాణ ఆమోదించిన బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలి
రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపట్లేదు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం: మహేశ్ గౌడ్
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50ు పరిమితి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎప్పుడో దాటిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. అందువల్ల విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లకు ఈ పరిమితి అడ్డు కాబోదని చెప్పారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను కేంద్రం ఆమోదించి రాజ్యంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. గాంధీభవన్లో బుధవారం మీడియా సమావేశంలో మహేశ్గౌడ్ మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే నాలుగు నెలల కిందట జరపాల్సిన ఆ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు. ఆ తర్వాత కులగణన సర్వే నివేదికల ఆధారంగా బీసీలకు 42ు రిజర్వేషన్ను కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించిందన్నారు. ‘‘బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోవాలన్నదే కాంగ్రె స్ తపన’’ అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా.. ఈ అంశంపై లోతుగా చర్చించి, ఏ రకంగా అయితే ఇచ్చిన హామీని అమలు చేయగలమో ఆ రకంగా చేస్తామన్నారు. ఈ అంశంలో తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కేంద్రం వద్ద ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు.
కాంగ్రెస్లోనే సామాజిక న్యాయం
ప్రస్తుతం కాంగ్రెస్లోనే సామాజిక న్యాయం ప్రజ్వరిల్లుతోందని మహేశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో నలుగురు ఎస్సీలు, ముగ్గురు బీసీలు ఉన్నారని, స్పీకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తొలి మంత్రివర్గం మ హిళలు, ఎస్సీలు లేకుండా నడిచిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ను తగ్గించింది బీఆర్ఎస్సే అని విమర్శించారు. రాష్ట్రంలో 18 నెలల కాంగ్రె స్ పాలన స్వర్ణయుగమేనని, ఎన్నికల ముందు ఇచ్చి న హామీల్లో మెజారిటీగా అమలు చేశామన్నారు.
ట్యాపింగ్తో సినీతారల సంసారాల్లో చిచ్చు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ, ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప చేసింది ఏమీ లేదని మహేశ్గౌడ్ అన్నారు. ఫోన్లు ట్యాప్ చేసి సినీతారల సంసారాల్లో చిచ్చు పెట్టిన ఘనత ఆ పార్టీ వాళ్లదని ఆయన ఆరోపించారు. జడ్జిలు, బ్యూరోక్రాట్లు, చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలనూ వదల్లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు సంబంధం లేకుండానే ప్రభాకర్రావు ఫోన్లు ట్యాపింగ్ చేశారా అని ప్రశ్నించారు. రిటైర్ అయిన అధికారిని ఇంటిలిజెన్స్ చీఫ్గా నియమించడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. బనకచర్ల విషయంలో ఏపీతో రాజీపడింది బీఆర్ఎస్ పార్టీనే అని మహేశ్గౌడ్ అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను పెంచుకునేందుకు వైఎస్ జగన్కు అనుమతిని ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.