పఠనా నైపుణ్యాలు పెంపొందించాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:34 PM
విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంపొందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.

- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్నగర్ విద్యావిభాగం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంపొందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం పట్టణంలోని పాలకొండ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్, తెలుగు పాఠ్యంశాలు చదివించి వారి నైపుణ్యాలు పరీక్షించారు. విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించాని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో కిచెన్ షెడ్కు సంబంఽధించి అంచనాలు రూపొందించాలన్నారు. అంతకుముందు పూర్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీలను తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారుల బరువులు పరిశీలించారు. ఓ పిల్లాడి బరువు తక్కువగా ఉండటం గమనించారు. పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని, బరువు, ఎత్తు పర్యవేక్షణ చేయాన్నారు. డీఈవో ప్రవీణ్కుమార్, సీఎంవో బైకాని బాలుయాదవ్ ఉన్నారు.
ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
భూత్పూర్ : ఆసుపత్రి పరిసరాలతో పాటు లోపల భాగాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ విజయందిర బోయి వైద్యులు, మునిసిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్కు సూచించారు. గురువారం భూత్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రసూతి, జనరల్ వార్డును ఆమె పరిశీలించారు. ప్రసూతి వార్డులో అపరిశుభ్రంగా ఉందని, వెంటనే శుభ్రం చేయాలని డాక్టర్ అబ్దుల్ రభ్కు సూచించారు. అదే విధంగా ఆసుపత్రి బయట పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో దాన్ని కూడా వెంటనే శుభ్రం చేయాలని మునిసిపల్ కమిషనర్ను ఆదేశించారు. వైద్యం బాగా చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? వైద్యులు సమయానికి ఆసుపత్రికి వస్తున్నారా? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. యూనాని వైద్యుడు జహీరోద్దీన్, ఎంపీడీవో ప్రభాకర్ చారి, ఎంపీవో శ్రీదేవి పాల్గొన్నారు.