ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:20 PM
పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా మారుతుందని, ఇక సమస్యలు తీరిపోతాయనుకున్న ప్రజల ఆశలన్నీ నీరుగారిపోయాయి.
- పంచాయతీ నుంచి మునిసిపల్గా మారినా అదే పరిస్థితి
- భూత్పూర్ 4వ వార్డు ప్రజల అవస్థలు
- డ్రైనేజీలు, రోడ్లు వేయాలని వేడుకుంటున్న స్థానికులు
భూత్పూర్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా మారుతుందని, ఇక సమస్యలు తీరిపోతాయనుకున్న ప్రజల ఆశలన్నీ నీరుగారిపోయాయి. భూత్పూర్ మునిసిపాలిటీలోని 4వ వార్డులో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. పంచాయతీగా ఉన్నప్పటి సమస్యలు నేటికి పరిష్కారం కాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. భూత్పూర్ పట్టణం 2018లో పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా మారింది. కౌన్సిల్ పరిపాలన కాలం ఈ నెల 26వ తేదీన పూర్తవుతున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలో ఏళ్లుగా సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య, వీధి లైట్లు, తాగునీటి సౌకర్యం సమస్యలు ఉన్నాయి. ఇటీవలే కాలనీలో 500 మీటర్ల వరకు సీసీ రోడ్డు, మునిరంగ స్వామి దేవాలయం వద్ద కల్యాణ మండపం, పాఠశాల ప్రహరిగోడ నిర్మాణం చేపట్టారు. కాలనీలో గ్రామం మొత్తానికి పెద్ద డ్రైనేజీ కాల్వ పారుతుంది. ఈ కాలువ పూర్తిగా కూలిపోయి మురుగు ఇళ్లలోకి వస్తుందని వాపోతున్నారు. చాలా కాలంగా లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న రక్షిత తాగునీటి ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరింది.