సేవాలాల్ మార్గదర్శకంలో అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:35 PM
సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశ్శీసులతో, వారి మార్గదర్శకంలో గిరిజన బంజారాలు అభివృద్ధి చెందాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. సంత్ సేవాలాల్ 286 జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం గిరిజన సంఘాల నాయకులు మహబూబ్నగర్లోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జయంతి వేడుకల్లో ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్ కలెక్టరేట్/పాలమూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశ్శీసులతో, వారి మార్గదర్శకంలో గిరిజన బంజారాలు అభివృద్ధి చెందాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. సంత్ సేవాలాల్ 286 జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం గిరిజన సంఘాల నాయకులు మహబూబ్నగర్లోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజార మహిళలుతో కలిసి, సంప్రదాయ నృత్యం చేశారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ విషయమై హోం మంత్రి అమిత్షాను, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రస్తావిస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో గిరిజన మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు.
సేవాలాల్ ఆశీస్సులతో అభివృద్ధి సాధిద్దాం: ఎమ్మెల్యే యెన్నం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి ప్రత్యేక పూజలు చేసి, ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ క్లాక్టవర్, పద్మావతి కాలనీ మీదుగా అయ్యప్పకొండకు చేరుకుంది. అక్కడ జయంతి సభను నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద, అయ్యప్పకొండ వద్ద నిర్వహించిన జయంతి సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిద్దామని అన్నారు. హన్వాడ, మహబూబ్నగర్లలో ఉన్న తండాల్లో బీటీ రోడ్లకు రూ.ఐదు కోట్లతో శంకుస్థాపన చేశామన్నారు. బంజారా బిడ్డలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ఎల్లప్పుడు తోడ్పాటు అందిస్తామన్నారు. బంజారాల లిపి గోర్గోలిని 8వ షెడ్యూల్లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ డి.జానకి, కె.శేఖర్, ఆర్.శేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి, ఆనంద్గౌడ్, తులసిరాం, ఛత్రపతి, కిషన్ పాల్గొన్నారు.
మహనీయుడు సేవాలాల్: శ్రీనివా్సగౌడ్
గిరిజన జాతికోసం అహర్నిశలు పాటుపడి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివా్సగౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, పూజలు చేశారు.