అమాయకుల పై పోలీసుల ప్రతాపం సరికాదు
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:33 PM
అమాయకులపై పోలీసుల ప్రతాపం సరికాదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
- దాడికి పాల్పడిన ఎస్ఐ, అందుకు పురమాయించిన నాయకుడిపై చర్య తీసుకోవాలి
- బాధితుడికి న్యాయం కోసం అవసరమైతే కొడంగల్ వ్యాప్తంగా ఆందోళన
- కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
మద్దూర్, కొత్తపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): అమాయకులపై పోలీసుల ప్రతాపం సరికాదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఎస్ఐ దాడిలో గాయపడిన మద్దూర్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన ఎల్లప్పను మాజీ ఎమ్మెల్యే బుధవారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. దాడికి గల కారణాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నరేందర్రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో తన తల్లి చేసిన పనికి సంబంధించిన డబ్బులు అడిగినందుకు కేసు పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించి అమానుషంగా చితకబాదడం ఎంతవరకు సమంజసమని పోలీసులను ప్రశ్నించారు. నాయకుల మెప్పు కోసం అమాయకులను హింసిస్తే చివరకు బలయ్యేది అధికారులేనన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఎలాం టి విచారణ చేయకుండా విచక్షణారహితంగా చితకబాదిన మద్దూర్ ఎస్ఐపై, ఇందుకు ప్రేరేపించిన గ్రామ మాజీ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం అవసరమైతే వివిధ సంఘాలతో కలిసి కొడంగల్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మద్దూర్, కొత్తపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు సలీం, గోపాల్, మధుసూదన్, మహిపాల్గౌడ్, తిరుపతి, సాయిలు, మైపాల్, రఫీ, శివారెడ్డి, ఆంజనేయులు, నరేందర్రెడ్డి, మణప్ప తదితరులున్నారు.