డిండికి నీళ్లు
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:27 PM
పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీటిని తరలించాలని ప్రభుత్వ యోచన వివాదాస్పదంగా మా రుతోంది.
- పాలమూరు నుంచి అర టీఎంసీ చొప్పున నీటిని తరలించేందుకు సన్నాహాలు
- వివాదాస్పదంగా మారనున్న సర్కార్ నిర్ణయం
- డోలాయమానంలో
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీళ్లు తరలిస్తే ఎగువ ప్రాంతంలో ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవు తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో నార్లాపూర్, ఏదుల మధ్య నుంచి అర టీఎంసీ నీటిని డిండికి తరలించా లని వచ్చిన ప్రతిపాదన పట్ల అప్పట్లో తీవ్రమైన వ్యతిరేకత దృష్ట్యా ఆ ప్రభుత్వం అలాంటి యోచనను విర మించుకున్నది. అయితే ఇటీవల మళ్లీ డిండికి నీటి తరలింపు వ్యవహారం ప్రధానంగా తెరమీదకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
నాగర్కర్నూల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీటిని తరలించాలని ప్రభుత్వ యోచన వివాదాస్పదంగా మా రుతోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రారం భమైన పనులు వివాదాస్పదంగా మారనున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన రాజకీయ పక్షాలు, ప్రజా సంఘా లు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. అత్యంత కీలకం గా ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీళ్లు తరలిస్తే ఎగువ ప్రాంతంలో ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
డిండికి నీటి తరలింపునకే సర్కార్ మొగ్గు?
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహ బూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి, వికా రాబాద్ జిల్లాల పరిధిలో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో రూ. 33వేల కోట్ల అంచనా వ్య యంతో పనులు ప్రారంభించారు. అనేక అవాంతరాల తో ప్రాజెక్టును పూర్తి చేయ డానికి మరో 33వేల కోట్లు అంటే మొత్తానికి 63వేల కోట్లు ఖర్చవుతాయని ఇరిగే షన్ అధికారులు నివేదికను రూపొందించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నార్లపూర్, ఏదుల మధ్య నుంచి అర టీఎంసీ నీటిని డిండికి తరలించాలని వచ్చిన ప్రతిపాదన పట్ల అప్పట్లో తీవ్రమైన వ్యతిరేకత దృష్ట్యా ఆ ప్రభుత్వం అలాంటి యోచనను విరమించుకుంది. అయితే ఇటీవల మళ్లీ డిండికి నీటి తరలింపు వ్యవహారం ప్రధానంగా తెరమీద కొచ్చింది. ఈ క్రమంలో నార్లపూర్, ఏదుల మధ్య నుంచి కాకుండా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి కి నీటిని మళ్లించాలని నిర్ణయానికొచ్చారు.
కృష్ణా జలాలను ఎలా సర్దుబాటు చేస్తారు..?
డిండికి అర టీఎంసీ నీటిని మళ్లించాలని యోచిస్తున్న ప్రభుత్వం కృష్ణా జలాలను సర్దు బాటు చేయగలుగుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికా రాబాద్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరందించాలంటే కనీసం 120 టీఎంసీల జలాలు అవసరమవుతాయి. ఇందుకు సంబంధించిన వ్యవస్థ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇంత వరకు పూర్తి కాలేదు. 60 రోజులు కృష్ణానదికి వచ్చే వరద జలాల ఆధారంగా 120టీఎంసీల నీటిని తోడుకునే మెకానిజం ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ అది ఇంత వరకు రూపుదిద్దుకోలేదు. కృష్ణానదికి వచ్చే వరద జలాల విషయంలో గడిచిన 20ఏళ్ల నుంచి పరిస్థితిని పరిశీలిస్తే 30 నుంచి 40రోజులు వరద వచ్చిన సందర్భాలే అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో అర టీఎంసీ నీటిని డిండికి తరలించాలని ప్రతి పాదన ఏదుల రిజర్వాయర్ నుంచి వచ్చినందున దిగువ ప్రాంతంలో ఉండే డిండికి తప్ప ఎగువ ప్రాంతాలైన మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారా బాద్ జిల్లాలకు సాగునీరందే పరిస్థితి ఉండదనే భావనను ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు.
రెండోసారి నిర్వాసితులుగా మారనున్న రైతులు
ఎంజీకేఎల్ఐ పథ కం కింద భూములు కోల్పోయిన రైతాంగం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కూడా త్యాగాలు చేయాల్సి వచ్చిం ది. ఏదుల నుంచి డిండికి నీటి మళ్లింపు చర్యలు ప్రారంభిస్తే రైతాంగం మరోసారి నిర్వాసితులుగా మారి మిగిలిన కొన్ని భూములను కూడా కోల్పో వాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. మరో అంశమేమిటంటే ఎంజీకేఎల్ఐ పథకం కింద ఇప్ప టికే ప్రధాన కాల్వల నిర్మాణం జరిగింది. పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద డిండికి నీటిని తరలించాలంటే కాల్వల వ్యవస్థ ఖచ్చితంగా దెబ్బతింటుంది. దీని వల్ల సర్కార్కు మరింత ఆర్థిక నష్టం తప్పదని సాగునీటి నిపుణులు పేర్కొం టున్నారు.