తెలంగాణ ఉద్యమకారుల అవస్థలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:47 PM
ప్రత్యేక రాష్ట్ర సాధనకు కదం తొక్కిన ఉద్య మకారులపై నమోదైన కేసులను ఇప్పటి వరకు ఎత్తివేయక పోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- మహబూబ్నగర్ కోర్టుకు హాజరైన 18 మంది
- కేసులు కొట్టివేయించాలని ప్రభుత్వానికి వినతి
పాలమూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక రాష్ట్ర సాధనకు కదం తొక్కిన ఉద్య మకారులపై నమోదైన కేసులను ఇప్పటి వరకు ఎత్తివేయక పోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న కొందరు, స్నేహితుల సహాయం తో కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఉద్యమకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేశామని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక కేసులో పెండింగ్ ఉన్నట్లు 2022లో పోలీసులు గుర్తించి సమన్లు జారీ చేశారు. అవి గత ఏడాది చివర్లో ఉద్యమకారులకు అందాయి. దీంతో 18 మంది ఉద్యమకారులు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. వారిలో కొందరు 72 ఏళ్ల వయసు వారు నడవలేని స్థితిలో అతి కష్టం మీద కోర్టుకు వచ్చారు. ఈ కేసులో ఉన్న ఐదుగురిని పోలీ సులు నేటికీ గుర్తించకపోవడం గమనార్హం. ప్రభుత్వం చొరవ తీసుకొని కేసును కొట్టి వేయించాలని వారు కోరుతున్నారు. కోర్టుకు హాజరైన వారిలో టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రానాయక్, చంద్రకాంత్ రెడ్డి, బాలరాజు, చంద్రకళ, శివరత్నమ్మ, పుష్ప, నర్సింహారెడ్డి, డేవిడ్, రవికుమార్, జావేద్ తదితరులున్నారు.