KTR: ఈడీ కేసు వల్లే రేవంత్ మోదీని కలిశారా?
ABN , Publish Date - May 26 , 2025 | 04:19 AM
కేంద్రం పరిధిలోని నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి భేటీకి హాజరుకావడం వెనుక ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.
మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలి: కేటీఆర్
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): కేంద్రం పరిధిలోని నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి భేటీకి హాజరుకావడం వెనుక ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్లో రేవంత్ పేరును చేర్చడంవల్లే ఆయన మోదీని ప్రత్యేకంగా కులుసుకున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడమే కాకుండా.. ప్రధానితో రేవంత్ రెడ్డి సరదాగా గడుపుతూ కనిపించారని, ఏం అద్భుతం జరిగిందో? అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా... ప్రపంచ సుందరి అందాల పోటీల నేపథ్యంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇలాంటి అనుభవాలు జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని, వారికి అవమానం జరిగితే ఈ రాష్ట్రం అంగీకరించదన్నారు.