Harish Rao: పిచ్చికుక్క హద్దు మీరి ప్రవర్తిస్తోంది
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:39 AM
మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం స్ట్రెచర్పై ఉన్నారని, తొందర్లోనే మార్చురీకి వెళ్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

పరిణతి లేకే మార్చురీ వ్యాఖ్యలు
సీఎంను మానసిక వైద్యునికి చూపాలి
మేం అధికారంలోకి రాగానే ‘ఆ విగ్రహాలను’ గాంధీభవన్కు పంపుతాం
కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్మీట్లా గవర్నర్ ప్రసంగం: కేటీఆర్, హరీశ్
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం స్ట్రెచర్పై ఉన్నారని, తొందర్లోనే మార్చురీకి వెళ్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. పిచ్చికుక్క హద్దుమీరి మర్యాద లేకుండా ప్రవర్తిస్తోందని, ఆలస్యం చేస్తే.. నైరాశ్యంతో చుట్టుపక్కల వారిని కొరికే ప్రమాదం ఉందంటూ సీఎంను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డిని ఆయన కుటుంబసభ్యులు వీలైనంత త్వరగా ఏదైనా మానసిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలని కోరారు. రాజకీయ పరిపక్వత లేక సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సీఎంకు క్యాన్సిల్ జబ్బు సోకిందని, ఎన్నికలపుడు తాను చెప్పినవన్నీ క్యాన్సిల్ అంటున్నారన్నారు. తానొక ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లరవేషాలు మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలిస్తూ.. ఇంకెంత కాలం డప్పుకొట్టుకుంటావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్పై చిల్లర విషయాలు చెబితే నమ్మడానికి ఉద్యోగాలు పొందిన వారు అమాయకులు కాదని కేటీఆర్, హరీశ్రావు స్పష్టం చేశారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రకటన చేశారు.
అన్నీ అబద్ధాలు, అసత్యాలు..
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేసిన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్మీట్లా ఉందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఆయా కుటుంబాలకు భరోసానిచ్చే ఒక్క మాట కూడా గవర్నర్ ప్రసంగంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి విజన్ లేదు, 20 శాతం కమీషన్ మాత్రమే ఉందని ఎద్దేవా చేస్తూ.. ఉపముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. 83 మంది విద్యార్థుల మరణాలపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క సానుభూతి మాట కూడా లేదని విచారం వ్యక్తం చేశారు. దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులగణన పేరుతో బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లపై దగా చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లి(సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహం)ని, రాహుల్ తండ్రి(రాజీవ్ గాంధీ విగ్రహం)ని తిరిగి గాంధీ భవన్కు పంపిస్తామని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో గవర్నర్లు మారినా ప్రసంగాలు మాత్రం మారలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా లేదని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి అసత్య ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ను వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ అని, చంద్రబాబు ేసవలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు గాంధీ కుటుంబం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలు చూేస ప్రజలు ఓట్లు వేశారని, అందుకు వారే తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.