Share News

Mahesh Kumar Goud: కేసీఆర్‌, ఈటల పాత బంధం చిగురించింది

ABN , Publish Date - May 31 , 2025 | 04:57 AM

కాళేశ్వరం విచారణ కమిషన్‌ నుంచి నోటీసులు రాగానే కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ మధ్య పాత బంధం మళ్లీ చిగురించిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Mahesh Kumar Goud: కేసీఆర్‌, ఈటల పాత బంధం చిగురించింది

  • శామీర్‌పేట ఫాంహౌస్‌లో ఈటలతో హరీశ్‌ భేటీ

  • అక్కడి నుంచే కేసీఆర్‌తో ఫోన్‌లో మాటామంతీ

  • బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం తథ్యం: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం విచారణ కమిషన్‌ నుంచి నోటీసులు రాగానే కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ మధ్య పాత బంధం మళ్లీ చిగురించిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. శామీర్‌పేటలోని ఓ ఫాంహౌ్‌సలో ఈటలతో హరీశ్‌రావు భేటీ అయ్యారని, అక్కడి నుంచి కేసీఆర్‌తో వారు ఫోన్‌లో సంభాషించారన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మహేశ్‌గౌడ్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఒక మునిగిపోయిన నావ అని, ఆ నావలో ఉన్న వస్తువుల్లో వాటాల కోసమే కేసీఆర్‌ కుటుంబంలో కొట్లాట జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీలో 8 సీట్లున్న బీజేపీతో బీఆర్‌ఎస్‌ కలిస్తే.. ఆ పార్టీ 8 సీట్లకే పరిమితమవుతుందన్నారు. కేసీఆర్‌ కూతురు కవిత, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల్ని పోల్చి చూస్తే బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం తథ్యమన్న సంగతి స్పష్టమవుతోందని వెల్లడించారు.


రాజాసింగ్‌, కవిత వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం గుట్టు వీడిందన్నారు. రాజాసింగ్‌ లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా.. రాహుల్‌పై విమర్శలు చేయడం బీజేపీ నేతల చేతగానితనమేనని మహేశ్‌ మండిపడ్డారు. ‘పాక్‌పై యుద్ధంతో సాధించిందేంటి.. కోల్పోయింది ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఇందిరాగాంధీని వాజ్‌పేయీ.. అపర కాళీ అని అభివర్ణించిన సంగతి కిషన్‌రెడ్డికి తెలియకపోవడం విడ్డూరం. ఇందిర హయాంలోనే అప్పటి కాంగ్రెస్‌ప్రభుత్వంవందల సర్జికల్‌ స్ట్రైక్‌లను చేసింది. సైనిక రహస్యాల్ని బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలని చూడటం శోచనీయం. కేసీఆర్‌, కిషన్‌రెడ్డిల వల్లే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారంటూ రాజాసింగ్‌.. పరోక్షంగా చెప్పారు’ అని వ్యాఖ్యానించారు. కవిత లేఖ లీకు వెనుక.. ఆమె ప్రమేయం.. కుటుంబ సభ్యుల ప్రమేయమూ ఉండొచ్చునన్నారు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 04:57 AM