Kavitha: కేసీఆర్ పాలన ఐఫోన్లా.. రేవంత్ పాలన చైనా ఫోన్లా ఉంది
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:20 AM
రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలన ఐఫోన్లా ఉంటే ప్రస్తుతం రేవంత్రెడ్డి పాలన చైనా ఫోన్ను తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలన ఐఫోన్లా ఉంటే ప్రస్తుతం రేవంత్రెడ్డి పాలన చైనా ఫోన్ను తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జగిత్యాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన చందాన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారినా.. గులాబీ సైనికులు బీఆర్ఎ్సను అంటిపెట్టుకునే ఉండడం అభినందనీయమన్నారు. కేసీఆర్ అండగా ఉన్నంత కాలం ఎత్తిన పిడికిలి దించేది లేదని స్పష్టం చేశారు. సారంగాపూర్ మండలం మంగేళ వద్ద ఓ రైతు తన పొలం ఎండిపోయిందని సోషల్మీడియాలో పెట్టిన విషయం తనను కలిచివేసిందన్నారు.
కేసీఆర్ పాలనలో వరదకాలువ ఓ జీవధారగా ఉండేదని కవిత పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెడుతూ, కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయాలు పక్కనపెట్టి కాళేశ్వరం లింక్-1 ద్వారా నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 31 సార్లు ఢిల్లీ వెళ్లే తీరికున్న సీఎం రేవంత్రెడ్డి బీసీ ప్రతినిధుల సమావేశానికి హాజరుకాకుండా ఏం చేసారని ఆమె ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బీసీ ఉద్యమ నేతలను అవమానించడమేనని అన్నారు.