ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:20 AM
ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎల్ఆర్ఎస్పై మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎల్ఆర్ఎస్పై మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకుంటే 25 శాతం తగ్గింపు వర్తిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈనెల 31వ తేదీ వరకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీపీవో మదన్మోహన్, టౌన్ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్, మండల పరిషత్, ఎంపీవో, సబ్రిజిస్ట్రార్ తదితర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద శాతం ప్రసవాలు చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష్యం మేరకు వంద శాతం ప్రసవాలు చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జన ఔషధి దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్బిణులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలన్నారు. డెలివరీకి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల మౌలిక సేవలు ఉన్నాయన్న అంశాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రానున్న వేసవి కాలం నేపథ్యంలో అన్ని సబ్సెంటర్లు, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ ద్రావణాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, పలువురు వైద్యులు, ఆశా కారకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.