పంట చేలల్లో సౌర విద్యుత్
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:12 AM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సురక్షా ఊర్జ ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) పథకం ద్వారా రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టిజిరెడ్కో) దీని అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్నది. ఈ సంస్థ రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

- ‘పీఎం కుసుమ్’తో 70శాతం రుణాలు
- జిల్లాలో 100 మెగావాట్ల ఉత్పత్తికి నిర్ణయం
- ఈనెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మహిళా సంఘాలకు ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సురక్షా ఊర్జ ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) పథకం ద్వారా రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టిజిరెడ్కో) దీని అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్నది. ఈ సంస్థ రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రైతులకు అదనపు ఆదాయవనరులను సమకూర్చడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్ధేశించిన ఈ పథకం కింద రాష్ట్రంలో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో 3,000 మెగా వాట్ల విద్యుత్ను రైతులు, సమష్టి, వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ సంస్థలు, రైతుల సమూహం ద్వారా, 1000 మెగావాట్లను మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 400 మెగావాట్లు, కరీంనగర్ జిల్లాలో 100 మెగావాట్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో రెండేసి మహిళా సంఘాలను ఎంపిక చేసి వాటి ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాలకు యూనిట్లను కేటాయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట, వీణవంక మండలం ఘన్ముకులలో మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు.