Pedpadalli: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:34 AM
కళ్యాణ్నగర్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ అమలులో విఫలమైందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు డిమాండ్ చేశారు.

కళ్యాణ్నగర్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ అమలులో విఫలమైందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు డిమాండ్ చేశారు. గురువారం ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై 14నెలలు పూర్తయినా ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్నారు. ఇండ్లు మంజూరు చేయాలని, అర్హులకు రేషన్కార్డులు ఇవ్వాలని, రైతు రుణమాఫీ చాలా మందికి జరుగలేదన్నారు. రైతు భరోసా పథకాన్ని రూ.17వేల నుంచి రూ.12వేలకు కుదిరించి అవి కూడా సకాలంలో ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం తుంగలో తొక్కారని, పెన్షన్లు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని, పూర్తయిన ఇండ్లను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పంటలకు మద్దతు ధర లేక రైతులు అప్పులపాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఈ నెల 20న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు టీ శ్రీనివాస్, కృష్ణ, ఈదునూరి నరేష్, వెంకన్న, శ్రీనివాస్, రామకృష్ణ, రాజేందర్, మల్లేషం, చంద్రయ్య, రాజేశం, దుర్గయ్య, పాల్గొన్నారు.