Share News

నిఘా నీడలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:20 AM

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఈసారి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా నిఘా నీడలో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది.

నిఘా నీడలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఈసారి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా నిఘా నీడలో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. ఫిబ్రవరి 3 నుంచి 20 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలపై నిఘాను పటిష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జిల్లాలోని ఇంటర్మీడియట్‌ అధికారులు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని ప్రయోగశాలలు గల గదుల్లో సీసీ కెమెరాలను బిగించే పనిని హైదరాబాద్‌లోని ఒక సంస్థకు అప్పగించింది. ఇందుకోసం ఒక్కో కళాశాలకు ప్రభుత్వం 12 వేల రూపాయలు కేటాయించింది. ఆమేరకు జిల్లాలో గల కళాశాలల్లో సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 13 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. సైన్స్‌ గ్రూపులు బోధించే ఆరు మోడల్‌, కస్తూర్బాగాంఽధీ విద్యాలయాలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, ఇతర వొకేషనల్‌ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 5,220 మంది ఉన్నారు. వీరంతా ప్రాక్టికల్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం 33 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం..

జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను హైదరాబాద్‌లో గల ఇంటర్మీడియట్‌ బోర్డు కమాండ్‌ కంటోల్‌ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. అక్కడ ఒక బృందం ఈ కెమెరాల ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించనున్నారు. ప్రాక్టికల్స్‌ నిర్వహించే గదుల్లో రెండేసి చొప్పున వీడియోతో పాటు వాయిస్‌ రికార్డింగ్‌తో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. జిల్లాలో సుమారు 5,220 మంది ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరవుతారు. ప్రశ్నాపత్రం ఏ రోజుకారోజు ప్రిన్సిపాల్‌ లాగిన్‌కు మెయిల్‌లో రావడంతోనే దానిని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రింట్‌ తీసుకొని విద్యార్థులకు అందిస్తారు. అక్రమాల నిరోధానికి మునుపెన్నడూలేని విధంగా ఇంటర్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో పలు కళాశాలల యాజమాన్యాలు ఆగమేఘాల మీద సీసీ కెమెరాల బిగింపు, ప్రాక్టికల్‌ పరికరాలు, రసాయనాలు తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రతీ కళాశాలకు రూ. 25 వేలు..

ప్రతీఏటా ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థులకు ప్రయోగ పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈసారి ప్రతీ కళాశాలకు 25 వేల రూపాయలను గత నెలలో కేటాయించింది. ఆ మేరకు భౌతిక, రసాయన శాస్త్రాలు, జంతు, వృక్ష శాస్త్రాల ప్రయోగాల కోసం కావాల్సిన పరికరాలు, రసాయనాలను కళాశాలల్లో సమకూర్చారు. దీంతో నెల రోజుల నుంచి అధ్యాపకులు విద్యార్థులకు ప్రయోగ పాఠాలు బోధిస్తున్నారు.

వ్యతిరేకిస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాలు..

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం వ్యతిరేకిస్తున్నది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవద్దని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తీరు సరిగా లేదని, ఆయనను బోర్డు నుంచి తప్పించాలని, లేకుంటే బోర్డు పరీక్షల కోసం తమ కళాశాలల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు సహకరించబోమని హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం ముందుకే వెళుతుందా, వెనక్కి తగ్గుతుందా చూడాలి.

పరీక్షలపై నిఘా పెంచేందుకే..

- కల్పన, డీఐఈవో పెద్దపల్లి

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలపై ఈసారి బోర్డు అధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, పైవ్రేటు, రెసిడెన్షియల్‌ కళాశాలలెవరైనా ప్రతీ ల్యాబ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే. ప్రతీ సీసీ కెమెరాపై బోర్డు ఉన్నతాధికారుల నిఘా ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రతి కళాశాల యాజమాన్యాలు పాటించాలి. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో సీసీ కెమెరాల బిగింపు పూర్తి కావస్తున్నది.

Updated Date - Jan 31 , 2025 | 01:20 AM