Share News

ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:49 AM

: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు.

ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

- కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

పెద్దపల్లిటౌన్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని, కనీస వేతనం 26 వేలు చెల్లిస్తామని వాగ్ధానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. కార్మికులు పీఎఫ్‌, ఈఎస్‌ఐ పెండింగ్‌ డబ్బులను మున్సిపల్‌ అధికారులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన వేతనాల ఎరియర్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో డైలీ వేజ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పాక మహేష్‌, ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి, వివిధ మున్సిపాలిటీల యూనియన్‌ నాయకులు ఆరెపల్లి చంద్రయ్య, బొంకూరి సాగర్‌, చింతల మరియా, ఎడ్లపల్లి రాజయ్య, రమేష్‌, మల్లేష్‌, సురేష్‌, లక్ష్మణ్‌, రామ్మూర్తి, కుక్క అన్వేష్‌, సలిగంటి సుశీల, లక్ష్మి, మధు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:50 AM